చైతన్య స్ఫూర్తి.. వినియోగదారుల హక్కులకు దిక్సూచి..
- హక్కులపై అవగాహన పెంపొందించేందుకు వినూత్న కార్యక్రమాలు
- ఒకరు వేసే ముందడుగు.. ఎందరో వినియోగదారులకు వెలుగురేఖ
- ప్రతిఒక్కరూ సుస్థిర జీవనశైలిని అలవరచుకోవాలి
- ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
చైతన్య స్ఫూర్తి వినియోగదారుల హక్కులకు దిక్సూచి అని.. వినియోగదారులు తమ హక్కులపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకొని, హక్కులను పరిరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ లక్ష్మీశ హాజరయ్యారు. తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పౌర సరఫరాల శాఖ-దీపం 2 పథకం, ఆహార భద్రత ప్రమాణాలు, తూనికలు-కొలతల శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కొనుగోలు చేసిన వస్తువు నాణ్యత, పరిమాణం, ధర ప్రమాణాలకు సంబంధించి తగిన సమాచారాన్ని కలిగి ఉండడమే కాక ఏదైనా దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా రక్షించబడే హక్కు వినియోగదారు హక్కు అని వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరం వినియోగదారులమేనని, నిత్యజీవితంలో రోజూ ఏదో ఒక వస్తువును కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.
మార్కెట్లో లభించే వివిధ రకాల వస్తువుల నాణ్యత, సరైన ప్రమాణాలతో రూపొందాయా అనే అంశంపై వినియోగదారులు దృష్టిసారించాలన్నారు. ప్రజలు ఏదయినా మోసానికి గురైతే పోనీలే అనే నిర్లిప్త ధోరణిని వీడి వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవాలన్నారు. మోసానికి వ్యతిరేకంగా మనం వేసే ఓ చిన్న అడుగు ఎందరికో వెలుగురేఖ అవుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది సుస్థిర జీవనశైలికి మార్పు ఇతివృత్తంతో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని.. మనకు వారసత్వంగా వచ్చి వనరులను ఎంత అవసరమో అంతవరకు మాత్రమే వినియోగించుకొని భావితరాలకు అందించాల్సిన అవసరముందని.. అప్పుడే సుస్థిరత సాధ్యమని పేర్కొన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థలు కూడా కీలక భాగస్వాములవుతున్నాయని.. అధికారులు కూడా ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఎల్లవేళలా అప్రమత్తతతో ఉండి నిబద్ధతతో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషిచేయాలన్నారు.
మారుతున్న అవసరాలు, మార్కెట్ ధోరణులు, సాంకేతికత అనుసంధాన ఈ-కామర్స్, ఆన్లైన్ లావాదేవీలకు అనుగుణంగా వినియోగదారుల రక్షణ చట్టాలు అమలవుతున్నాయని జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యులు శశికళ వివరించారు. చట్టంపై అవగాహన పెంపొందించుకొని వినియోగదారులు తమ హక్కులను పరిరక్షించుకోవాలని పేర్కొన్నారు. యూఎన్వో మార్గదర్శకాలు తదనంతరం చట్టాల రూపకల్పన, 1986 నాటి చట్టం, 2019 చట్టంలోని ముఖ్యాంశాలు తదితరాలను వివరించారు.