
జిల్లా కేంద్రం, ఫిబ్రవరి 26: మాతృ మరియు శిశు మరణాలను అరికట్టేందుకు వైద్యాధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. పేర్కొన్నారు. స్వస్థ కార్యక్రమంలో భాగంగా గురువారం మాతృ–శిశు మరణాల నియంత్రణపై వైద్యాధికారులతో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు.
గర్భిణుల్లో రక్తహీనత ప్రధాన సమస్యగా మారుతున్న నేపథ్యంలో హై రిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యులకు కలెక్టర్ ఆదేశించారు. గర్భిణుల్లో రక్తహీనత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన పోషకాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. గర్భధారణ ప్రారంభ దశలోనే రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలన్నారు.
BAPATLA NEWS FEBRAVARY26:సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరం లేని ఆపరేషన్లు తగ్గిస్తే మాతృ–శిశు మరణాలను నియంత్రించవచ్చని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వ, ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు.
కౌమార దశ నుంచే బాలికలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని, ముందస్తుగా రక్త పరీక్షలు చేయించాలని ఆదేశించారు. గర్భిణీలకు ఆరోగ్య సిబ్బంది ద్వారా సమగ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఆరోగ్యంపై చైతన్యం కల్పించి సమాజంలో ఆరోగ్యకరమైన మార్పు తీసుకురావాలని సూచించారు.Bapatla Local News
ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని పేర్కొంటూ, వైద్యాధికారులు సమన్వయంతో పనిచేసి మాతృ–శిశు మరణాలను గణనీయంగా తగ్గించాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, డి.సి.హెచ్.ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి, కమ్యూనిటీ హెల్త్ అధికారులు మరియు ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.







