
ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి ‘శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం’
- ఏలూరులో ఘనంగా పురస్కార ప్రదానోత్సవం, సేవా కార్యక్రమాలు
- పాల్గొన్న ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎం. అనిల్ కుమార్, ప్రొఫెసర్ మృణాళిని
ఏలూరు: సమాజ సేవలో, సాహితీవేత్తలను గౌరవించడంలో గుప్తా ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ (IRS) శ్రీ ఎం. అనిల్ కుమార్ కొనియాడారు. ఏలూరులోని వైఎంహెచ్ఏ (YMHA) హాలులో ఆదివారం (మార్చి 1న) గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2025 సంవత్సరపు సామాజిక సేవా కార్యక్రమాల సమీక్ష, ‘శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కార’ ప్రదానోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా జరిగాయి.
సత్యవతికి దక్కిన అరుదైన గౌరవం తెలుగు సాహితీ రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి పి. సత్యవతికి ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ‘శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని’ ప్రదానం చేశారు. ముఖ్య అతిథి శ్రీ ఎం. అనిల్ కుమార్, ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ మడుపల్లి మోహన్ గుప్త, వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం ఆమె సాహితీ ప్రస్థానాన్ని కొనియాడుతూ చేసిన కరతాళ ధ్వనులతో మారుమోగింది.
పురస్కార గ్రహీతను కాలిఫోర్నియా ఆరియా యూనివర్సిటీ తెలుగు చైర్ ప్రొఫెసర్ శ్రీమతి చుండూరి మృణాళిని సభకు పరిచయం చేశారు. సత్యవతి రచనల్లోని లోతును, సామాజిక స్పృహను విశ్లేషిస్తూ, ఆమెకు ఈ పురస్కారం దక్కడం అత్యంత సముచితమని ప్రశంసించారు. అనంతరం సత్యవతి స్పందిస్తూ.. ఈ పురస్కారం అందుకోవడం తన సాహితీ ప్రయాణ మజిలీలో దక్కిన గొప్ప, అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు హర్షం వ్యక్తం చేశారు. సాహితీవేత్తలను గౌరవించడం ద్వారా సమాజానికి మంచి సందేశం అందుతుందని ముఖ్య అతిథి అనిల్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు: మడుపల్లి మోహన గుప్తా కార్యక్రమంలో గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ మడుపల్లి మోహన గుప్తా మాట్లాడుతూ.. భవిష్యత్తులో తమ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, మరియు సాహితీ రంగాల్లో సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరిస్తామని సభాపూర్వకంగా వెల్లడించారు.Eluru Local News
గుప్తా సంస్థల ప్రతినిధి శ్రీ కె. శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, సాహితీ ప్రియులు, ఫౌండేషన్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.







