
విజయవాడ:-ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ మహోత్సవాలను పురస్కరించుకుని కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారు శనివారం విజయవాడకు విచ్చేశారు.

ఇంద్రకీలాద్రికి వేంచేస్తున్న జగద్గురువులకు తొలుత ప్రకాశం బ్యారేజ్ వద్ద దేవస్థానం తరపున ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదల ప్రకారం మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ దుర్గమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వాహణాధికారి వి.కె. శీనానాయక్, ఆలయ అర్చకులు, ధర్మకర్తలు స్వామివారికి పుష్పమాలలు సమర్పించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం స్వామివారిని శోభాయాత్రగా ఇంద్రకీలాద్రిపైకి తీసుకెళ్లారు.
ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న జగద్గురువులకు వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని లోక కల్యాణార్థం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను సమర్పించి గౌరవించారు.
అనంతరం స్వామివారు కుంభాభిషేక మహోత్సవం కోసం ఏర్పాటు చేసిన మహా యాగశాలను సందర్శించారు. అక్కడ జరుగుతున్న చతుర్వేద పారాయణలు, హోమాలు, వైదిక క్రతువులను క్షుణ్ణంగా పరిశీలించారు. వైదిక కమిటీ సభ్యులు, స్థానాచార్యులు ప్రస్తుత ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను స్వామివారికి వివరించారు. ఈ సందర్భంగా జగద్గురువులు అధికారులకు, అర్చకులకు అమూల్యమైన సూచనలు అందిస్తూ ఆశీస్సులు అందజేశారు.Vijayawada Localnews
ఈ మహా యజ్ఞం విజయవంతంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తూ జగద్గురువులు అనుగ్రహ భాషణం చేశారు. జగద్గురువుల రాకతో ఇంద్రకీలాద్రి భక్తి సంద్రమైందని, కంచి పీఠాధిపతుల పావన దర్శనంతో కుంభాభిషేక మహోత్సవాలకు మరింత విశిష్టత చేకూరిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, ఏఈఓలు, పర్యవేక్షకులు, వేద పండితులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







