
వేకువజామునే గోకుల తిరుమల గిరి ప్రదక్షిణ చేసిన శాసనసభ్యులు
- భక్తులతో పోటెత్తిన ఏడుకొండల క్షేత్రం.. లక్షకు పైగా ఆదాయం
జంగారెడ్డిగూడెం:
స్థానిక ఏడుకొండలపై వెలసిన గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో వేకువజామున 4:30 గంటలకే సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, బాల భోగ నివేదన వంటి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు.

గిరి ప్రదక్షిణ చేసిన ఎమ్మెల్యే:
పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు శనివారం ఉదయం పారిజాత గిరి ప్రదక్షిణ చేసి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు ఘనస్వాగతం లభించింది. అనంతరం అర్చకులు ఆయనకు అష్టోత్తర పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు మరియు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఈవో కలగల శ్రీనివాస్ మరియు సభ్యులు పాల్గొన్నారు.
పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల మొక్కులు:
పరీక్షల సమయం కావడంతో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ హాల్ టికెట్లను స్వామివారి పాదాల చెంత ఉంచి, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అన్నదాన వితరణ:
వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో మరియు ధర్మకర్తల మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన కోటపోతుల బాబి – వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, మరియు ఉండవల్లి రాధాకృష్ణ అన్నదాతలుగా వ్యవహరించి భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు. వీరిని ఆలయ అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు శేష వస్త్రాలతో సన్మానించారు.
ఆలయ ఆదాయం:
ఈ ఒక్క రోజే పూజా టికెట్లు, విరాళాలు, ప్రసాదాలు మరియు అన్నదాన విరాళాల ద్వారా మొత్తం రూ. 1,00,800 (అక్షరాలా లక్షా ఎనిమిది వందల రూపాయలు) ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కలగల శ్రీనివాస్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు అన్నప్రగడ వీర రాఘవరావు, కన్నా కృష్ణ, కొప్పుల నాగ సురేంద్ర, ఆరేపల్లి నాని, దండు భవాని తదితరులు పాల్గొన్నారు.http://ELURU NEWS







