
వేలేరుపాడు, మార్చి 09: ఏజెన్సీ ప్రాంతంలోని రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. నిధులు మంజూరైనా, పనులు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో నాణ్యత మాత్రం మచ్చుకైనా కనిపించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల ధన దాహం తోడై రోడ్ల నిర్మాణం అభాసుపాలవుతోంది.
నాణ్యతకు తిలోదకాలు.. కాసుల వేటలో కాంట్రాక్టర్లు!
కుక్కునూరు నుండి వసంతవాడ వరకు జరిగిన ప్యాచ్ వర్క్ పనులే ఇందుకు నిదర్శనం. నిబంధనల ప్రకారం జరగాల్సిన పనులను గాలికి వదిలేసి, కేవలం ఒక ట్రాక్టర్ చిప్స్తో మమ అనిపించి లక్షల రూపాయల ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లు జేబుల్లో నింపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నీళ్లు కొట్టే తీరిక లేక.. రోడ్లు ఆగమాగం!
వినాయకపురం నుండి రెడ్డిగూడెం వరకు, అలాగే రెడ్డిగూడెం నుండి కొయిదా వరకు వేస్తున్న ప్యాచ్ వర్క్ పనుల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదు.
- జెట్ మిక్స్ పోసి వదిలేయడం: రోడ్డుపై జెట్ మిక్స్ పోసిన తర్వాత తగినంత నీరు పోసి రోలింగ్ చేయాల్సి ఉండగా, నీళ్లు తడిపే నాధుడే కరువయ్యారు.
- పర్యవేక్షణ శూన్యం: పనులు ఎలా జరుగుతున్నాయి? మెటీరియల్ సక్రమంగా వాడుతున్నారా? లేదా? అని చూడాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం.
ప్రజల డిమాండ్: కొత్తూరు – వేలేరుపాడు రోడ్డుకు మోక్షమెప్పుడు?
అవసరం లేని చోట ప్యాచ్ వర్క్లతో హడావుడి చేస్తున్న అధికారులు, అత్యంత కీలకమైన కొత్తూరు నుండి వేలేరుపాడు రహదారిని మాత్రం విస్మరించారు. ప్రస్తుతం ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతిని, గుంతలమయంగా మారింది. ఈ రోడ్డును ప్యాచ్ వర్క్లతో సరిపెట్టకుండా, పూర్తిగా తొలగించి కొత్త రోడ్డు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.CM Chandrababu Naidu advised ministers and leaders to clear Telangana’s doubts about the Polavaram-Banakacharla connectivity project.
“కాంట్రాక్టర్లు తమ ఇష్టం వచ్చినట్లు పనులు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? నాణ్యత లేని పనుల వల్ల కొద్దిరోజులకే రోడ్లు మళ్ళీ పాడైపోతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించాలి.” — వేలేరుపాడు మండల ప్రజలు
ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు నిద్ర మత్తు వీడి, పనుల్లో జరుగుతున్న లోపాలను సరిదిద్దాలని, నాణ్యమైన రహదారులను నిర్మించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.







