
తెనాలి, మార్చి 14: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు మరో అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 16న అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని, సుమారు 2 టన్నుల ఐరన్ స్ట్రాప్ (ఇనుప వ్యర్థాల) తో ఆయన విగ్రహాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. ఆటోనగర్ శివారులోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచిన ఈ భారీ విగ్రహాన్ని శనివారం మధ్యాహ్నం విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థాన పాలక మండలి సభ్యులు తోటకూర వెంకట రమణారావు, బిసి సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు సందర్శించారు.

ఈ సందర్భంగా వారు విగ్రహాన్ని తిలకించి శిల్పుల పనితీరును ప్రశంసించారు. పనికిరాని ఇనుప ముక్కలతో ఒక మహనీయుని రూపాన్ని ఇంత స్పష్టంగా తీర్చిదిద్దడం కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రవిచంద్రల కళా నైపుణ్యానికి నిదర్శనమని కొనియాడారు. తమ అద్భుత సృజనతో తెనాలి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతున్నారంటూ శిల్పులను వారు ప్రత్యేకంగా అభినందించారు.TENALI LOCAL NEWS:తెనాలి ఫ్లైఓవర్పై భారీ ట్రాఫిక్ జామ్







