
పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్ జిల్లా): ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు గ్రామ ఎస్సీ కాలనీవాసులు దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలతో అల్లాడిపోతున్నారు. తమ ప్రాంత సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని, పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం స్థానిక ప్రజలు మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కనీస సౌకర్యాలు లేక, అంటువ్యాధుల భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రధాన సమస్యలను వివరిస్తూ.. రెండు నెలల క్రితం కాల్వ పూడికతీతలో భాగంగా తీసిన చెత్తను రోడ్డుకు ఇరువైపులా కుప్పలుగా వదిలేశారని ధ్వజమెత్తారు. ఆ చెత్త కుప్పలు కుళ్లిపోయి భయంకరమైన దుర్వాసన వెదజల్లుతున్నాయని, దోమల బెడదతో పిల్లలు తరచూ డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాల బారిన పడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తక్షణమే ఆ చెత్తను తొలగించి, డస్ట్ బిన్లు ఏర్పాటు చేసి తమ ప్రాణాలను కాపాడాలని వేడుకున్నారు.

మరోవైపు, కాల్వకు ఇరువైపులా సైడ్ వాల్స్ లేకపోవడం, మట్టి రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వర్షం కురిస్తే ఆ ప్రాంతం నరకాన్ని తలపిస్తోందని, తక్షణమే సిమెంట్ రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, కాల్వపై తగినన్ని కల్వర్టులు లేకపోవడంతో సుమారు 50 మందికి పైగా పాఠశాల విద్యార్థులు ప్రాణాలకు తెగించి తాటి మొద్దులు, సిమెంటు స్తంభాలపై నడుస్తూ కాల్వ దాటుతున్నారని, ఈ క్రమంలో ఇప్పటికే పలువురు పిల్లలు ప్రమాదాలకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులు, పిల్లల భద్రత దృష్ట్యా ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన కల్వర్టులు నిర్మించాలని అనిగండ్లపాడు ఎస్సీ కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.http://NTR DISTRICT NEWS







