
చీరాల, మార్చి 23: బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ప్రధాన రహదారి అయిన చర్చ్ రోడ్డులో ఉన్న మామిడి పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఇతర బంక్లలో పెట్రోల్, డీజిల్ నిరంతరాయంగా సరఫరా అవుతున్నప్పటికీ, ఈ నిర్దిష్ట బంక్లో మాత్రం “స్టాక్ లేదు” అనే సమాధానం వినిపిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పెట్రోల్ అయిపోయి వాహనాలను నెట్టుకుంటూ బంక్ వరకు చేరుకున్నా, సిబ్బంది కనికరం లేకుండా సమాధానం చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై సిబ్బందిని ప్రశ్నిస్తే కనీస మర్యాద లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు మండిపడుతున్నారు. బంక్ పని వేళలు లేదా ఇంధన లభ్యతపై కనీసం ఒక సమాచార బోర్డు కూడా ఏర్పాటు చేయకపోవడం యాజమాన్య బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, రాత్రివేళల్లో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.http://BAPATLA DISTRICT NEWS







