
రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం విచ్చేసిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావును రాజమహేంద్రవరంలోని మంజీరా హోటల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతితో పాటు రాష్ట్రంలోని పలు నీటి పారుదల అంశాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని, ప్రాజెక్టు నిర్మాణంతో పాటే సమాంతరంగా నిర్వాసితుల సహాయ, పునరావాస (R&R) పనులను కూడా వేగవంతం చేశామని మంత్రి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పెండింగ్ డిజైన్లకు తక్షణమే అనుమతులు వచ్చేలా సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

అలాగే, పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచిన నేపథ్యంలో, దానికి సంబంధించిన రియంబర్స్మెంట్పై సానుకూలంగా స్పందించాలని మంత్రి కోరారు. ఏటా సగటున 3 వేల టీఎంసీల గోదావరి వరద జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని, ఈ నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా ‘పోలవరం-నల్లమలసాగర్’ ప్రాజెక్టుకు తక్షణమే సాంకేతిక, ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తుఫానులు, ఆటుపోట్ల వల్ల కలిగే సముద్రపు కోతను నివారించేందుకు, అలాగే గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి వంటి ప్రధాన నదుల ఏటిగట్ల పటిష్టతకు కేంద్రం అండగా నిలవాలని కోరారు.

మరోవైపు, డెల్టా ప్రాంతంలోని డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణతో పాటు, సముద్రపు ముఖద్వారాల వద్ద పూడిక తీత, వెడల్పు పనులకు నిధుల సాయం అందించాలని మంత్రి నిమ్మల విన్నవించారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున, కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులతో ముందుకు వెళ్లకుండా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. మంత్రి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన కేంద్ర కార్యదర్శి వి.ఎల్. కాంతారావు.. RRR, PMKSY మరియు ఫ్లడ్ మేనేజ్మెంట్ పనులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.Godavari Rail – A 50-Year Lifeline for the People of Godavari || గోదావరి రైల్ – గోదావరి ప్రజల 50 ఏళ్ల జీవనాడి







