
గుంటూరు: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు అందేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని డి.ఆర్.సి సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (DCC), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (DLRS) సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కౌలు రైతు రుణాలు, విద్యా రుణాలు, పశుసంవర్ధక, ఎంఎస్ఎంఈ (SME), పీఎం ముద్ర, స్వానిధి, పీఎం విశ్వకర్మ వంటి వివిధ పథకాల కింద నిర్దేశించిన లక్ష్యాలను, బ్యాంకుల వారీగా సాధించిన ప్రగతిని ఆయన సమీక్షించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు లక్ష్యాల సాధనలో ముందంజలో ఉన్నాయని, అయితే ప్రైవేటు బ్యాంకులు కౌలు రైతులకు మరియు ఇతర ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలకు రుణాలు అందించడంలో వెనుకబడి ఉన్నాయని, వారు తమ పనితీరును తక్షణమే మెరుగుపరుచుకోవాలని జెసి స్పష్టం చేశారు.

ముఖ్యంగా పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారులకు సబ్సిడీ అందుతుందని, దీనిపై మెప్మా, డిఆర్డిఏ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బ్యాంకుల్లో సుమారు 149 కోట్ల రూపాయల అన్క్లెయిమ్డ్ (ఎవరూ క్లెయిమ్ చేయని) సొమ్ము ఉందని, అందులో 120 కోట్లు ప్రజలకు సంబంధించినవేనని తెలిపారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జెసి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్, నాబార్డ్ డీడీఎం, ఆర్బిఐ ప్రతినిధులు మరియు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.http://GUNTUR NEWS







