
ధర్మాజీగూడెం: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం తన స్వగ్రామమైన ధర్మాజీగూడెంలోని కోదండరామాలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మాన్ని కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజాపాలకుడు శ్రీరాముడని, సీతారాముల పవిత్ర బంధం భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. శ్రీరాముని ఆశీస్సులతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

అనంతరం ధర్మాజీగూడెం హైస్కూల్ రోడ్డులోని శ్రీ సీతారామాంజనేయ ఆలయం, తూర్పువీధిలోని సీతారామాలయం, పడమట వీధిలోని కోదండ సీతారామాలయంతో పాటు కాటమరెడ్డిపల్లిలోని రామాలయాన్ని కూడా ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రమూర్తి సుగుణాలను అలవర్చుకుని ఆదర్శ జీవితం గడపాలని, రామరాజ్య స్థాపనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.http://ELURU DISTRICT NEWS







