
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సూర్య శిల్పశాల శిల్పులు శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని అయోధ్యలోని బాల రాముడి (రామ్ లల్లా) విగ్రహాన్ని అచ్చం అదే మాదిరిగా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీ హర్షలు దాదాపు ఐదు నెలల పాటు శ్రమించి, అత్యాధునిక త్రీడీ (3D) టెక్నాలజీని ఉపయోగించి 4.5 అడుగుల ఎత్తు, 50 కేజీల బరువుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.

శుక్రవారం ఉదయం నుండి ఈ విగ్రహాన్ని శిల్పశాల వద్ద ప్రదర్శనకు ఉంచగా, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామ మందిరంలో కొలువుదీరిన బాల రాముడిని తలపిస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు.http://GUNTUR NEWS







