
బాపట్ల, మార్చి 31, 2026: బాపట్ల జిల్లాను గంజాయి మరియు మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మరియు జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన మాదకద్రవ్యాల నియంత్రణ సమన్వయ కమిటీ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి “డ్రగ్స్ వద్దు.. ఈగల్ క్లబ్స్” ప్రత్యేక ప్రచార బోర్డులను విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటికే 74 హాట్ స్పాట్లను గుర్తించి పోలీసు నిఘా ఉంచామని, యువత మరియు విద్యార్థులు ఈ వ్యసనాల బారిన పడకుండా అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు. 100 మంది విద్యార్థులున్న ప్రతి పాఠశాలలో ‘ప్రహరీ క్లబ్’లు ఏర్పాటు చేయాలని, వెబ్సైట్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ సూచించారు.

ముఖ్యంగా బాపట్ల రైల్వే స్టేషన్ మీదుగా రోజుకు 120 రైళ్లు రాకపోకలు సాగిస్తున్న దృష్ట్యా, రైల్వే స్టేషన్లు మరియు బస్టాండ్లలో నిఘా పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యంలో భాగంగా శక్తి మరియు ఈగల్ బృందాలు మరింత చురుగ్గా వ్యవహరించాలని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. రెండో విడతలో జిల్లా వ్యాప్తంగా సమగ్ర ప్రణాళికతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ సమయంలోనూ సచివాలయ సిబ్బంది గంజాయి వ్యతిరేక ప్రచారం చేయాలని సూచించారు. ఏదైనా అనుమానిత వ్యక్తులు లేదా ప్రాంతాల గురించి సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలపాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బాపట్ల, చీరాల డీఎస్పీలు, ఆర్డీవో మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.http://BAPATLA LOCAL NEWS







