
కుక్కునూరు: అధికారులు తవ్వకాలకు అనుమతులు లేవని ఆదేశాలు ఇచ్చినా, వాటిని లెక్కచేయకుండా కుక్కునూరు మండలం పెదరాయిగూడెం గ్రామంలో అధికార పార్టీకి చెందిన నాయకులు యథేచ్ఛగా మట్టి, గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ మరియు అటవీ శాఖ భూములలో జెసిబిలతో గ్రావెల్ తవ్వకాలు చేస్తూ, ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
మండలంలో ఈ పరిస్థితి సర్వసాధారణమై పోయింది. ఖాళీగా కనిపించే ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములను టార్గెట్ చేస్తూ గ్రావెల్ మాఫియా బరితెగిస్తుంది. పెదరాయి గూడెం పంచాయతీ పరిధిలోని గ్రామాలలోని ఇంటి అవసరాల నిమిత్తమని చెబుతూ, అనధికారికంగా ఏర్పాటు చేసిన జామాయిల్, జామ క్లోన్ నర్సరీలకు గ్రావెల్ తరలిస్తూ లాభాలు గడిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది.
ఈ అక్రమ తవ్వకాలపై అధికారులు స్పందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసినప్పటికీ అధికారులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బాహాటంగానే చెబుతున్నారు. అధికారం ఉంది కదా, మనల్ని ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ ఉందని గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. అటవీ, ప్రభుత్వ భూములలో గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ అధిక ధరలకు గ్రావెల్ను విక్రయిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ తవ్వకాలను అరికట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.







