AP NEWS: టిటిడి సేవలను అభినందించి పలు సూచనలు చేసిన ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ
THIRUMALA MEETING WITH ASSEMBLY COMMITEE
శ్రీవారి భక్తులకు టిటిడి అందిస్తున్న సేవలపై ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ సంతృప్తిని వ్యక్తం చేసింది. గతంలో భక్తులకు అందిస్తున్న సేవలకు, ప్రస్తుతం అందిస్తున్న సేవలలో చాలా మార్పు కనిపిస్తోందని ఏపీ శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మెన్ వేగుల్ల జోగేశ్వరరావు వెల్లడించారు. శ్రీవారి భక్తుల సేవ నిరంతరం సేవ అని, శ్రీవారి భక్తులకు మరింత నాణ్యంగా అందిస్తూ శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని సూచించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతీ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ ఛైర్మెన్ వేగుల్ల జోగేశ్వర రావు మాట్లాడుతూ, అంచనాల కమిటీ చేసిన పలు సూచనలను పరిగణలోకి తీసుకుని మరింత నాణ్యంగా సేవలు అందించాలని సూచించారు. వైద్య సేవలపై అభినందనలు : ఇటీవల తాను శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చానని, అనుకోకుండా అనారోగ్యానికి గురై తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేరగా వైద్య సేవలు చాలా నాణ్యతగా, సేవాతత్వంతో అందించారని ఏపీ అంచనాల కమిటీ సభ్యులు పెన్మత్స వరాహ వెంకట సూర్యనారాయణ రాజు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అశ్విని ఆసుపత్రి సిబ్బందిని ఆయన అభినందించారు. టిటిడిలో అమలవుతున్న సేవలపై సభ్యులు సంతోషం వ్యక్తం చేయగా, పరిశుభ్రత, పారిశుధ్యం – తిరుమలలో పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, భక్తులు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సేవలు అందుతున్నాయన్నారు. వసతి గదుల నిర్వహణపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని సభ్యులు సూచించారు. నవతరానికి శ్రీవారి వైభవాన్ని తెలియజేసేలా డిజిటల్ మీడియాను మరింత బలోపేతం చేయాలని సూచించారు. శ్రీవారి సేవ – రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీవారి సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని టిటిడి ఈవో వెల్లడించారు. వివిధ విభాగాలలో నైపుణ్యం, నిపుణుల సేవలను అన్ని విభాగాలలో అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఈవో తెలిపారు. అదే విధంగా తిరుమలలో క్రమం తప్పకుండా టిటిడి సేవలపై ప్రకటనలు ఇవ్వాలని, టిటిడి వసతి గృహాలలో అన్ని చోట్ల శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి చిత్ర పటాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వామివారి కీర్తనలు, గోవింద నామావళిని రాత్రి 10 గం.ల వరకు వినిపించేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరగా, టిటిడి ఈవో సమాధానం ఇస్తూ, ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టామని, మరింత పటిష్టంగా అమలు చేస్తామని ఈవో చెప్పారు.