AP NEWS: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు – సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ SIPB సమావేశం
CM CHANDRABABU MEETING ON SIPB
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థల ఆసక్తి చూపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని వెను వెంటనే ప్రాజెక్టుల స్థాపనకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు శంకుస్థాపనలు కూడా నిర్వహించగా… మరి కొన్ని కంపెనీలు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంపై విశ్వాసం కోల్పోయిన పారిశ్రామిక వేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. 11 నెలల కాలంలో ఎస్ఐపీబీ ఇప్పటికి 6 సార్లు సమావేశం కాగా, 76 ప్రాజెక్టులకు సంబంధించి రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. తాజాగా గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 6వ ఎస్ఐపిబి సమావేశంలో 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటికి సంబంధించి రూ. 33 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఎనర్టీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకు వచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలు… ప్రాజెక్టుల శంకుస్ధాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలి. ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం ఫాలోఅప్ చేయాలి. ఆయా సంస్ధల పెట్టుబడులు, క్షేత్ర స్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్ బోర్డ్ తీసుకురావాలి. తద్వారా ఏ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకోవచ్చు. పెట్టుబడులతో పాటు వచ్చిన ఉద్యోగాల వివరాలతో పోర్టల్ రావాలి. ఎస్ఐపిబి సమావేశాల్లో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు… ఇప్పటికే ఆమోదం తెలిపి ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రోగ్రస్ వివరించాలి’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.