వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ పర్యటనపై సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల్లో రాంగోపాల్ రావు రాత్రి హత్య చేసి తెల్లవారి పరామర్శించే విధంగా జగన్ పర్యటన ఉందని ఘాటు విమర్శలు చేశారు. గుంటూరులోని తన నివాసంలో కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు చనిపోవడానికి వైసిపి యే కారణమని చెప్పారు. 2024 ఎన్నికల ఫలితాల సందర్భంగా ఇంట్లో 10 లక్షలు ఉండగా రెండు కోట్ల వరకు బెట్టింగ్ పెట్టి నష్ట పోయాడని తెలిపారు. బంధువులు ఎవరు ఆర్థికంగా సపోర్ట్ చేయకపోగా అవమానించిన కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. నీ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాన్ని జగన్ ఎలా పరామర్శిస్తాడని సూటిగా ప్రశ్నించారు. తెనాలిలో కూడా గంజాయి బ్యాచ్ ని పరామర్శించేందుకు జగన్ వెళ్లి హడావిడి చేశాడని చెప్పారు. గతంలో చంద్రబాబు ఛలో ఆత్మకూరు చేపడితే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినవారు ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే, వైసిపి పుట్టుకే ఒక మోసం అని ధ్వజమెత్తారు. జగన్ అరాచకత్వం, రాక్షసత్వాన్ని చూసి 2024 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఇలానే అరాచకాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని ఆయన వెల్లడించారు. ప్రజలను మోసం చేస్తూ జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.