అమరావతి, సెప్టెంబర్ 18:– రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పశుపోషకులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులు నెలకొన్న జిల్లాల్లో సీపీఐ నాయకులు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించినట్లు రామకృష్ణ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులను సాధారణ ప్రకృతి వైపరీత్యంగా కాకుండా అత్యవసర పరిస్థితిగా పరిగణించి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారుAmaravathi news.
వర్షాభావం కారణంగా పంటలు నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే రైతులకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు అందించాలని కోరారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యవసాయ కార్మికులు, పశుపోషకులకు కూడా తగిన సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు.
సీఎంను కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, ముప్పాళ్ల నాగేశ్వరరావు ఉన్నారు.



