AP NEWS: కమ్మవాళ్ళు వైఎస్సార్సీపీ లో ఉంటే నీకెందుకు బాధ చంద్రబాబు – వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
రాష్ట్రంలో కొందరు పోలీసులు కుల ఉన్మాదంతో పనిచేస్తున్నారని.. కమ్మవాళ్లు కేవలం చంద్రబాబుకి ఊడిగం చేయడానికే పుట్టారా? అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడి డీఎస్పీ హనుమంతరావు కుల ఉన్మాది. కమ్మ పుట్టుక ఎందుకు పుట్టావంటూ లక్ష్మీనారాయణ అనే కార్యకర్తను ఆయన అవమానించారు. అది భరించలేక సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సీఎం, ఆయన కుమారుడు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో ఆ వీడియోలో చెప్పాడు. లక్ష్మీనారాయణ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చంద్రబాబూ.. మీకు ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా?. వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు నాగమల్లేశ్వరరావు, గుత్తా లక్ష్మీనారాయణ.. ఈ ముగ్గురి విషయంలో.. నేను చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. మా పార్టీలో కమ్మ వాళ్లు ఉండొద్దా? మీ పార్టీ కేవలం వారికేనా? అని వైఎస్ జగన్ నిలదీశారు. వైఎస్సార్సీపీలోని కమ్మ సామాజిక వర్గ నేతలను చంద్రబాబు టార్గెట్ చేసి వేధిస్తున్నారు. చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే, వెంటాడి వెంటాడి వేధిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. జైలుకు పంపిస్తున్నారు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును పొట్టన పెట్టుకున్నాడు. ఏం పాపం చేశాడని లక్ష్మీనారాయణ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేలా చేశారు. చంద్రబాబుకి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేడనే దేవినేని అవినాష్ ను వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని వల్లభనేని వంశీని జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.