BAPATLA NEWS: చిన్న, సన్నకారు రైతుల వ్యక్తిగత వ్యవసాయ పరికరాల సరఫరాలో రాయితీ మొత్తాన్ని రైతులకు అందజేసిన కలెక్టర్ జె. వెంకట మురళి
చిన్న సన్న కారు రైతులకు వ్యవసాయ పరికరాలను 50 శాతం రాయితీతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో రాయితీ పై పనిముట్లు పొందని రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫామ్ మేకనైజేషన్ మరియు అగ్రికల్చర్ మేకనైజేషన్ క్రింద వ్యవసాయ యంత్ర పరికరాలను మంజూరు చేసిందని ఆయన తెలిపారు. కర్షక పోర్టల్ ఆధారంగా లబ్ధిదారులను సాంకేతికంగా ప్రభుత్వ వివరాలను వినియోగించి పారదర్శకంగా ఎంపిక చేసి యంత్రాలను అందజేయడమైనదని అన్నారు. 577 మందికి ట్రాక్టర్ తో నడిచే యంత్ర పరికరాలు, 42 మందికి రోటమేటర్లు, 51 మందికి బ్యాటరీ స్ప్రేయర్లు, 374 మందికి పవర్ స్ప్రేయర్లు, 5 గురికి ట్రాక్టర్ స్ప్రేయర్లు, 3 పవర్ వీడర్లు, 4 గురికి బ్రష్ కట్టర్, 5 గురికి పవర్ టిల్లర్లను గత 4 మాసముల నుండి రైతు కేంద్రాల వద్ద అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మొత్తం ఒక వెయ్యి 61 మంది రైతులకు వివిధ రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేయడమైనదని అన్నారు. ఈ యంత్రాలను ఆగ్రో ద్వారా సరఫరా చేయడమైనదని తెలిపారు. ఒక వెయ్యి 61 మంది రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించి 50 శాతం రాయితీ మొత్తం 2 కోట్ల10లక్షల2వేల358 రూపాయలను రైతులకు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో కొంతమంది చిన్న సన్నకారు రైతులకు తైవాన్ స్ప్రేయర్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామకృష్ణ, జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మి, బాపట్ల వ్యవసాయ అధికారి శారద, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.