AP NEWS: ఎపి మోడల్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలు – లెర్నింగ్ అవుట్ కమ్స్ పై ప్రత్యేక దృష్టి సారించాం – కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో లోకేష్ భేటీ
ఎపి మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మంత్రి లోకేష్ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాప్రమాణాల మెరుగుదలకు చేపడుతున్న సంస్కరణలను కేంద్రమంత్రికి వివరించారు. ఇందులో భాగంగా ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విద్యాప్రమాణాల మెరుగుదలకు 9600 మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటుచేసి, వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. 700 యుపి స్కూళ్లను హైస్కూళ్లుగా అప్ గ్రేడ్ చేశాం. అకడమిక్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇస్తున్నాం. ఎటువంటి రాజకీయం జోక్యం లేకుండా టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ తెచ్చి సీనియారిటీ ప్రాతిపదికను ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలను విజయవంతంగా పూర్తిచేశాం. రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు యూనివర్సిటీల్లో ఏకీకృత చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. యూనివర్సిటీల ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మెరుగుదలకు కృషిచేస్తున్నాం. కెజి టు పిజి కరిక్యులమ్ లో మార్పులు తెస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా వచ్చే పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఎన్ఎస్ క్యుఎఫ్ నైపుణ్యాభివృద్ధి కోర్సులను అమలుచేస్తున్నాం. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత ఉపాధి అవకాశాలకు చర్యలు క్యాంపస్ లలోనే శిక్షణ ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేయబోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీని డిజిటల్ యూనివర్సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. సమర్థ్, స్వయం, స్వయం ప్లస్ కార్యక్రమాల అమలు వల్ల ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో (జిఇఆర్) 36శాతం నుంచి 50శాతానికి పెరిగింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో భాగంగా రాష్ట్రంలో కొత్త యూనివర్సిటీలను ఏర్పాటుచేస్తునాం. విశాఖపట్నంలో ఎఐ యూనివర్సిటీ, అమరావతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (IIULER)ని ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి బడిబయట ఉండకూడదు, చదువు పూర్తిచేసి ప్రతి విద్యార్థికి ఉద్యోగం లభించాలన్న లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.