GUNTUR LATEST NEWS: గుంటూరులో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులు ప్రారంభం
జూన్ 23వ తేదీ సోమవారం నుండి శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు ఏసీ కాలేజీ వైపు నుండి మొదలు పెట్టనున్నందున సోమవారం నుండి ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శంకర విలాస్ ఆర్ఓబి పనులకు సంబంధించి ఆర్ అండ్ బి , నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్ట్ సైట్ ఇంజనీర్లు , ట్రాఫిక్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ 23వ తేదీ నుండి శంకర విలాస్ ఆర్ఓబి పనులు మొదలు పెట్టనున్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ మళ్లింపుకు పకడ్బంధీ చర్యలు చేయాలని ట్రాఫిక్ సిఐని ఆదేశించారు. ట్రాఫిక్ ఏ ఏ మార్గాలలో మళ్ళిస్తున్నారో పత్రికా ప్రకటన ద్వారా , సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మూడు వంతెనల దగ్గర రోడ్డు లెవెల్ సరిచేయాలని జిఎంసి అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.విశ్వనాథరెడ్డి , డి ఈ చిన్నయ్య జెఈ సాయి క్రిష్ణ , నగరపాలక సంస్థ ఎస్ఈ కే.నాగేశ్వరరావు, సిటీ ప్లానర్ బి. రాంబాబు , ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ , వర్క్ కాంట్రాక్టర్ తరపున సైట్ ఇంజనీర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.