‘యువత పోరు’లో పెద్ద ఎత్తున యువతరం పాల్గొనాలి-వైసీపీ నేతలు
గుడివాడ — కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో నష్టపోయిన యువతరానికి మద్దతుగా, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 23న జరగనున్న ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కృష్ణాజిల్లా వైసిపి యువజన విభాగ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ పిలుపునిచ్చారు.
గుడివాడ రాజేంద్రనగర్ లోని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్ ను పార్టీ సీనియర్ నాయకులు మండలి హనుమంతరావు, పాలేటి చంటి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నందివాడ మండల అధ్యక్షుడు పేయ్యల ఆదాం తదితర నాయకులతో కలిసి మెరుగు మాల కాళీ శనివారం ఉదయం ఆవిష్కరించారు.
అనంతరం ఖాళి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నిరుద్యోగ భృతిని విస్మరించిందని, దానిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఏడాది పాలనలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘ఇంటికో ఉద్యోగం లేదా నెలకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు’ ఇస్తామన్న హామీ కొండెక్కిందని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది జనవరి 1న నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ‘యువగళం’ పేరుతో రాష్ట్ర యువత అందరినీ లోకేష్ మోసం చేశారని కాళీ ధ్వజమెత్తారు.మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద 23వ తేదీన జరగనున్న యువత పోరు ధర్నాలో కృష్ణా జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కాళీ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకు యువతరం సిద్ధమయ్యారని పార్టీ సీనియర్ నాయకులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో రాష్ట్రంలోని యువత, విద్యార్థులతో పాటుగా అన్ని వర్గాలు తీవ్రంగా మోసపోయాయని పార్టీ నాయకులు అన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గం వైసీపీ యూత్ అధ్యక్షుడు గంటా సురేష్, పట్టణ అధ్యక్షుడు అడపా హర్ష, పార్టీ నాయకులు అద్దేపల్లి పురుషోత్తం,లోయ రాజేష్,సింహాద్రి రాంబాబు,రమణ కుమార్,జ్యోతుల మణికంఠ,చుండూరు శేఖర్,తాళ్లూరి ప్రశాంత్, మూడేడ్ల ఉమా,రావు గణేష్, పుల్లేటికుర్తి కృష్ణ,నిరుడు ప్రసాద్,హారిక,మద్దాల సురేఖ, పెద్ద సంఖ్యలో యువత, వైసిపి నాయకులు పాల్గొన్నారు.