
రెంటపాళ్ల పర్యటన సందర్భంగా తాను వెళ్తున్న వాహనం కింద పడి చీలి సింగయ్య మృతికి కారణమైన వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను రెండో నిందితుడుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై గత వారం గుంటూరులోని నల్లపాడు స్టేషన్ లో మృతుడు సింగయ్య భార్య లూర్థుమేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 106 (1) కింద కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఫుటేజీలలో సింగయ్య.. జగన్ వాహనం కిందే పడి మృతిచెందినట్లు వెల్లడవడంతో పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చారు. తెలిసీ మరణానికి కారణమయ్యారని బీఎన్ఎస్లోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఇదే కేసులో ఏ1గా చేర్చారు. ఏ 3గా జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె. నాగేశ్వరరెడ్డి, ఏ4గా వైవీ సుబ్బారెడ్డి, ఏ5గా పేర్ని నాని, ఏ6గా విడదల రజిని తదితరులను చేర్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు.








