
అమరావతి / లండన్ / దోహా, ఫిబ్రవరి 4, 2026 :-ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం యూకేలోని లండన్, ఖతార్ రాజధాని దోహాలలో పర్యటించింది. అమరావతిలో నిర్మించనున్న అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, టూరిజం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల రూపకల్పనకు సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టులను ఈ పర్యటనలో అధ్యయనం చేశారు.
ఈ పర్యటనలో మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ పాల్గొన్నారు.Amaravathi news
లండన్లో రెండు రోజులపాటు పర్యటించిన మంత్రి బృందం, సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై నగర అభివృద్ధి ప్రణాళికలు, పర్యాటక ప్రాజెక్టులపై చర్చించింది. థేమ్స్ నది ఒడ్డున అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ను పరిశీలించి, కృష్ణా నది తీర అభివృద్ధికి ఇదే మోడల్ను అనుసరించవచ్చని మంత్రి నారాయణ అభిప్రాయపడ్డారు.
లండన్లోని బాటర్సీ పవర్ స్టేషన్, ప్రపంచ ప్రసిద్ధ లండన్ ఐ అబ్జర్వేషన్ వీల్ను సందర్శించి వాటి నిర్మాణ విధానాలను అధ్యయనం చేశారు. అమరావతిలో కూడా లండన్ ఐ తరహా భారీ వీల్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అలాగే లండన్ స్ట్రాట్ఫర్డ్లోని క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్క్ను పరిశీలించారు. 2012 ఒలింపిక్స్ కోసం నిర్మించిన ఈ పార్క్లోని లండన్ స్టేడియం, ఆక్వాటిక్స్ సెంటర్, లీ వ్యాలీ వెలొపార్క్ తదితర క్రీడా వేదికలను సందర్శించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు.
లండన్ పర్యటన అనంతరం ఖతార్ రాజధాని దోహాకు చేరుకున్న మంత్రి బృందం, ఆస్పైర్ జోన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్గా పేరొందిన దోహా స్పోర్ట్స్ సిటీని సందర్శించింది. ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, ఆస్పిటర్ స్పోర్ట్స్ మెడిసిన్ హాస్పిటల్, ఆస్పైర్ అకాడమీలను పరిశీలించి వాటి ప్రత్యేకతలను తెలుసుకున్నారు.
250 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన దోహా స్పోర్ట్స్ సిటీలో 2006 ఆసియన్ గేమ్స్ నిర్వహించిన తీరు, 2022 ఫిఫా వరల్డ్ కప్కు వేదికైన లుసైల్ స్టేడియం నిర్వహణపై కూడా అధ్యయనం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ అంశాలపై దోహా అధికారులతో చర్చించారు.
లండన్, దోహా పర్యటనల్లో అధ్యయనం చేసిన ఉత్తమ ప్రాజెక్టులను అమరావతిలో అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని మంత్రి నారాయణ బృందం గురువారం ఉదయం భారత కాలమానం ప్రకారం విజయవాడకు చేరుకోనుంది.










