Amaravathi News: Minister Kandula Durgesh is happy about the GSI recognition of Belum Caves
- పురాతన సంస్కృతీ, వారసత్వానికి బెలుం గుహలు ప్రతీకని వెల్లడి
- అంతర్జాతీయ స్థాయిలో బెలూం గుహలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని హామ
అమరావతి: పురాతన సంస్కృతీ, వారసత్వానికి ప్రతీక అయిన బెలుం గుహలకు భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు దక్కడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ప్రకటనతో నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో క్రీ.పూ 450 ఏళ్ల నాటి చరిత్ర గలిగి సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బెలూం గుహలకు పర్యాటకంగా మరింత ప్రాచుర్యం లభిస్తుందని భావిస్తున్నామన్నారు.
భౌగోళిక వారసత్వ ప్రదేశంగా వచ్చిన గుర్తింపుతో మరింత అభివృద్ధికి నోచుకునేందుకు అవకాశముందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో రెండోది, దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా బెలూం గుహలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందాయన్నారు. బెలూం గుహల్లో భూగర్భంలో దాగి ఉన్న ఊహాతీతమైన ప్రకృతి సౌంద్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడమే గాక ఆహ్లాదాన్ని సైతం అందిస్తున్నాయన్నారు. లక్షలాది మంది పర్యాటకులు వీటిని చూసేందుకు వస్తుంటారని మంత్రి వివరించారు. దేశవిదేశీ పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమలో తిరుమల, అహోబిలం, మహానంది, యాగంటి, శ్రీశైలం, బ్రహ్మంగారిమఠం, గండికోట, సిద్ధవటం, గండి, హార్సిలీహిల్స్ తదితర పదుల సంఖ్యలో అధ్యాత్మిక క్షేత్రాలతో పాటు అందమైన పర్యాటక ప్రదేశాలు కోకొల్లలు ఉన్నాయని వాటన్నింటిని అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు.