
విజయవాడ: :28-11-25:-అణగారిన వర్గాలు, స్త్రీల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలేనని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. పూలే వర్థంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్ర ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు అర్పించి నివాళులు తెలిపారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన మంత్రి సవిత మాట్లాడుతూ… దేశం గర్వించదగ్గ సంఘసంస్కర్తల్లో మొదటి వరుసలో నిలిచే మహాత్ముడు పూలేనని అన్నారు. మహారాష్ట్ర పూణేలో జన్మించిన పూలే అంటరానితనం నిర్మూలన, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, మహిళా సాధికారత కోసం అపారమైన పోరాటం చేశారన్నారు. దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించి, అన్ని కులాలకూ ప్రవేశం కల్పించిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు.

వితంతు పునర్వివాహాలపై సమాజంలో చైతన్యం తీసుకువచ్చి… స్వయంగా అనేక వితంతువుల వివాహాలు జరిపించడం ద్వారా పూలే సమానత్వానికి మార్గదర్పకులయ్యారని మంత్రి అన్నారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తోందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయన్నారు. పూలే పేరుతో బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత కూడా టీడీపీదేనని మంత్రి సవిత వివరించారు.ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకటగురుమూర్తి, డూండీ రాకేశ్, పేరేపి ఈశ్వర్, బ్రహ్మ చౌదరి, యాటగిరి రాంప్రసాద్, యర్రబోతు రమణారావుతో పాటు డైరెక్టర్లు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.







