
విశాఖపట్నం, జనవరి 23:-ప్రాంతాలు వేరైనా భారతదేశ పౌరులుగా మనమంతా ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఇ చైర్మన్ తమ్మిరెడ్డి శివ శంకరరావు అన్నారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో విశాఖపట్నం యూత్ హాస్టల్స్లో శుక్రవారం ప్రారంభమైన అంతర్ రాష్ట్ర యువ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా శివ శంకరరావు మాట్లాడుతూ భారతదేశ పౌరులుగా గర్వంగా జీవిస్తున్నామని తెలిపారు. మినీ ఇండియాగా పేరుగాంచిన విశాఖపట్నం యువతకు ఎన్నో అనుభూతులను అందిస్తుందని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను తెలుసుకోవాలని సూచించారు.
ఈ అంతర్ రాష్ట్ర యువ సమ్మేళనంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది యువతులు సహా మొత్తం 37 మంది యువత పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ఏపీ విభిన్న ప్రతిభావంతులు శాఖ సహాయ సంచాలకులు కవిత మాట్లాడుతూ కేంద్ర యువజన సేవలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు యువతకు దిశానిర్దేశం చేస్తున్నాయని అన్నారు. ఈ పర్యటనలో తేనెలొలికే తెలుగు భాషలోని పదాలను నేర్చుకోవాలని యువతకు సూచించారు.

మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్, ఉమ్మడి విశాఖ జిల్లా యువ అధికారి జి. మహేశ్వర రావు ప్రారంభ ఉపన్యాసంలో యువ సమ్మేళనం లక్ష్యాలను వివరించారు. సీనియర్ జర్నలిస్టు నాగనబోయిన నాగేశ్వరరావు వ్యాఖ్యతగా వ్యవహరించారు.

Hyderabad- Amaravathiఈ కార్యక్రమంలో పురాతన వస్తువుల సేకరణకర్త కోరుపోలు గంగాధర రావు, రాజీవ్ గాంధీ జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవి కుమార్, మేరా యువ భారత్ పూర్వ ఉద్యోగి అల్లం రామ్ ప్రసాద్, సమాజహిత పత్రిక సంపాదకులు కె. నరసింహం తదితరులు ప్రసంగించారు. అనంతరం యువ సమ్మేళన గోడ పత్రికను అతిథులు ఆవిష్కరించారు.
మేరా యువ భారత్ ప్రతినిధులు కె. శ్రీనివాసరావు, ప్రసన్న గోపాల్, వాలంటీర్లు జేమ్స్, ప్రసన్న కుమార్, జ్ఞానదీప్, రాజు తదితరులు కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

యువ సమ్మేళనంలో భాగంగా కోరుపోలు గంగాధర రావు ఏర్పాటు చేసిన పురాతన వస్తు ప్రదర్శన యువతను విశేషంగా ఆకర్షించింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్, దంతేవాడ, సూరజ్పూర్, సుర్గుజా, రాజ్గఢ్, మహాసముంద్, బాలోద్, రాయపూర్ జిల్లాల నుంచి వచ్చిన యువత ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.










