AP LATEST NEWS: శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి పోలీస్ శాఖ తరఫున పటిష్ట బందోబస్తు – జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్
GUNTUR SP MEETING
తుళ్లూరు పోలీస్ స్టేషన్, వెంకటపాలెం గ్రామంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం నిర్వహించనున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి సుమారు 1000 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లాఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఆలయ ప్రాంగణం నందు ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ వద్ద పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి బందోబస్తుకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు గాని, ట్రాఫిక్ సమస్యలు గానీ తలెత్తకుండా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు నిర్వహించాలని చెప్పారు. బందోబస్తు నిర్వహణకు వీలుగా సభా ప్రాంగణాన్ని సెక్టార్లుగా విభజించి, ప్రతి ఒక్క సెక్టార్కు అదనపు ఎస్పీ లేదా డిఎస్పీ స్థాయి అధికారులను ఇంచార్జీలుగా నియమించి వారికి సహాయకులుగా సీఐలను, ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని కేటాయించడం జరిగినదని తెలిపారు. వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖులు, భక్తులు, సందర్శకుల వాహనాలకు సంబంధించి ప్రత్యేకమైన పార్కింగ్ ప్రదేశాలను కేటాయించడం జరిగినది. కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే సంబంధిత వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకుంటే విధినిర్వహణ సులభతరం అవుతుంది. వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖులు, భక్తులు, సందర్శకుల వాహనాలకు వాహనాల రాకపోకలకు కేటాయించిన మార్గాల్లోనే వారిని అనుమతించాలి. వాహనాల ట్రాఫిక్ సక్రమంగా నడవడానికి అందరూ సమిష్టిగా విధులు నిర్వహిస్తూ, ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించాలి. భక్తుల రద్దీ దృష్ట్యా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ క్యూలైన్ల వద్ద, వాహనాల రాకపోకల మార్గాల్లో ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా చూసుకోవాలి. సభా ప్రాంగణంలో ఇద్దరు సిఐల (సివిల్ సీఐ + కమ్యూనికేషన్ సీఐ)తో కూడిన బృందంతో కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మొత్తం బందోబస్తు నిర్వహణను క్షణ క్షణం పర్యవేక్షించడం జరుగుతుంది. ఏదైనా సెక్టార్లో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ వారికి తెలియపరచి వాటిని పరిష్కరించుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల సహాయంతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని, వాహనాల ట్రాఫిక్, భక్తుల రద్దీ, పార్కింగ్ కేంద్రాల్లో వాహనాల పార్కింగ్ మొదలగు వివిధ అంశాలకు సంబంధించి పరిశీలించడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించడానికి అదనపు బలగాలను కూడా సిద్ధం చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో, బాధ్యతతో సమన్వయం కలిగి విధులు నిర్వహిస్తే మనం బందోబస్తు నిర్వహణలో విజయం సాధిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు.