AP LATEST NEWS: స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోండి -మహిళలకు మంత్రి సవిత పిలుపు
PUBLIC INFORMATION - AP GOVT NEW PROGRAM FOR WOMEN'S
మహిళలకు ఎన్డీయే ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆర్థిక మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంది. టైలరింగ్ లో మహిళలకు శిక్షణ అందజేసి, వారికి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేయనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ, ఇప్పటికే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో టైలరింగ్ లో శిక్షణ అందజేసి, ఉచితంగా కుట్టుమిషన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సమాజాభివృద్ధిలో మహిళలే కీలకమని గుర్తించిన టీడీపీ ప్రభుత్వాలు…వారి సాధికారితకు, ఆత్మగౌరవానికి, సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నాయి. ఇళ్ల పట్టాలను మహిళల పేరునే మంజూరు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు కూడా వారి పేరు మీదనే చేపడుతున్నారు. విద్య, ఉద్యోగావకాశాల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా సీఎం చంద్రబాబుదే. స్వయం ఉపాధి పథకాల్లోనూ మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇంటి పట్టున ఉండే మహిళలకు ఆర్థిక భరోసా కలిగేలా టైలరింగ్ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి కుట్టుమిషన్లను కూడా ఉచితంగా అందజేయనున్నారు. ఈ నెల ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా లబ్ధిదారులకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యలో ఈ శిక్షణా కేంద్రాలు ప్రారంభంకానున్నాయి. సమాజాభివృద్ధిలో మహిళల పాత్రే కీలకమని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చిల్లర దుకాణాలు, కుట్టు శిక్షణ, అగరబత్తీలు, పామాయిల్ తదితర చిన్నపాటి వ్యాపారాల వైపు నడిపిస్తూనే… ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలు, మంగళగిరి, ధర్మవరం చీరలు, పూతరేకులు, చెక్క బొమ్మలు, పిల్లల ఆట బొమ్మల తయారీలో భాగస్వాములను చేస్తోందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,02,832 మహిళలకు టైలరింగ్ శిక్షణ అందజేసి, కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నామన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సీఎం చంద్రబాబు నాయుడు లక్షసాధనలో భాగంగా తమవంతు సంపద సృష్టిలో భాగస్వాములు కావాలని మంత్రి సవిత కోరారు.