AP NEWS: గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం – విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో కేంద్రాన్ని కోరిన మంత్రి గొట్టిపాటి
AP TRASCO MINISTER RAVIKUMAR
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు కేంద్రం సహాయం చేయాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజ్ఞప్తి చేశారు. ఇంధన శాఖ కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ అధ్యక్షతన వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంధన శాఖ మంత్రులు లక్నోలో సమావేశం అయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో డిస్కంలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి., డిస్కంలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల్ని కేంద్ర సహాయ మంత్రికి వివరించారు. గడిచిన ఐదేళ్లలో ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ రంగం సర్వనాశనం అయ్యిందని గొట్టిపాటి కేంద్రానికి వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.50,000 కోట్ల అప్పుల భారం డిస్కంలపై పడినట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో డిస్కంలకు రావాల్సిన సబ్సిడీలను కూడా సకాలంలో చెల్లించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 11,352 కోట్లు డిస్కంలకు చెల్లించి వాటికి పునర్జీవం పోసినట్లు మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కూడా రూ.13,000 కోట్లకు పైగా విద్యుత్ రంగానికి కేటాయించామని తెలిపారు. డిస్కంలను అప్పుల ఊబిలో నుంచి బయట పడేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు.