AP NEWS: మంచి ఓపిక, సహనం ఉన్న న్యాయమూర్తి జస్టిస్ డా. వి.ఆర్.కె.కృపాసాగర్రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
మంచి ఓపిక, సహనం ఉన్న న్యాయమూర్తిగా జస్టిస్ డా.వి.ఆర్.కె.కృపాసాగర్ పేరుతెచ్చుకున్నారని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. కేసుల వాదన విషయంలో ఇరు పార్టీలకు తమ వాదనను స్వేచ్చగా వినిపించుకునే అవకాశాన్ని కల్పించి న్యాయమైన, సంతృప్తికరమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో వీరికి వీరే సాటన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందజేస్తున్న జస్టిస్ డా.వి.ఆర్.కె. కృపాసాగర్ పదవీ విరమణ సందర్బంగా బుధవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ డా.వి.ఆర్.కె.కృపాసాగర్ సేవలను కొనియాడారు. 1994 లో మునిసిఫ్ మెజిస్ట్రేట్ గా న్యాయ వ్యవస్థలో ప్రస్తానాన్ని ప్రారంభించి న్యాయ సేవలు అందించడంలో మంచి ప్రతిభ కనబరుస్తూ స్వయం కృషితో అంచలంచలుగా ఎదుగుతూ 2022 ఆగస్టు 4 న హైకోర్టు జడ్జి గా నియమించబడ్డారని అభినందించారు. వీరు వ్రాసిన పలు ఆర్టికల్స్ పలు లా జర్నల్స్ లో ప్రచురితమై యువ న్యాయవాదులకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఏ.పి. జ్యూడిషియల్ అకాడమీ బోర్డు గవర్నరుగానే కాకుండా పలు కమిటిల్లో వీరు సభ్యులుగా ఉంటూ న్యాయ వ్యవస్థకు ఉత్తమమైన సేవలు అందజేయడం వీరి ప్రతిభకు నిదర్శనమన్నారు. పరిపాలనా పరంగానే కాకుండా న్యాయవ్యవస్థ పరంగా ప్రముఖ సేవలు వీరు అందజేశారన్నారు. హైకోర్టు జడ్జిగా మూడేళ్ల పాటు సేవలు అందజేసిన వీరు విభిన్న అంశాలను పర్యవేక్షిస్తూ అంకిత భావంతో విధులనల నిర్వహిస్తూ పలు కేసులను కూడా పెద్ద ఎత్తున పరిష్కరించి న్యాయపరమైన అంశాల, చట్టాలపై వీరికి ఉన్న సమగ్ర అవగాహనను, పట్టును నిరూపించుకున్నారని ప్రశంసించారు.