AP NEWS: మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి సవిత భరోసా
‘ఆపరేషన్ సిందూర్ లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మంత్రి సవిత అందజేశారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లిన మంత్రి.. వీర జవాన్ మురళీ నాయక్ సమాధి వద్ద అంజలి ఘటించారు. అనంతరం రూ.50 లక్షల చెక్కు, 5 ఎకరాల భూమి, 6 సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను ఆయన తల్లిదండ్రులకు అందజేశారు. గ్రామంలో రూ.14 లక్షలతో మురళీ నాయక్ సమాధి, అక్కడికి వెళ్లేందుకు రూ.16లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నేతలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదా? అని మంత్రి సవిత ప్రశ్నించారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ఖండించారు. తమది ఫొటోలు, రంగుల ప్రభుత్వం కాదని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.