AP NEWS: యోగ యజ్ఞాన్ని విజయవంతం చేయాలి – ప్రజలకు మంత్రి సత్య కుమార్ యాదవ్ విజ్ఞప్తి
రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా యోగకు ప్రాచుర్యం కల్పించే దిశగా ఒక యజ్ఞంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నెల రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం శనివారం నాడు పతాక స్థాయికి చేరనున్నదని,ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమాలలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. యోగాభ్యాసం వలన ప్రజారోగ్యానికి కలిగే బహుళార్ధ ప్రయోజనాల దృష్ట్యా ఈ దిశగా ప్రజల్లో చైతన్యం కలిగించటానికి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాన వేదిక అయిన మన రాష్ట్రం ప్రజల భాగస్వామ్యం విషయంలో ముఖ్యమంత్రి ఆలోచనలు మేరకు పలు రికార్డులు నెలకొల్పేలా గత నెల రోజులుగా ప్రజల్లో చైతన్యం కల్పించటానికి ప్రణాళిక బద్ధమన కృషి జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ప్రయత్నం తప్పక విజయం సాధిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా ప్రధాన కార్యక్రమం విశాఖపట్నం బీచ్ నుండి భీమునిపట్నం బీచ్ వరకు 5 లక్షల మంది యోగాభిలాషులతో శనివారం (జూన్ 21) నాడు జరగనుంది.అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా చోట్ల 2 కోట్ల మంది యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. గత నెల రోజులుగా యోగ విద్యను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. వివిధ స్థాయిల్లో యోగకు సంబంధించి పలు పోటీలు,జిల్లాకు ఒక ఇతివృత్తం ఆధారంగా యోగ కార్యక్రమాలు ,వంద ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాలలో యోగ ప్రదర్శనలు నిర్వహించారు. విశాఖపట్నంలో శనివారం ఉదయం జరిగే ప్రధాన కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు కనుసన్నలలో ఒక ప్రతిష్ఠాత్మక యజ్ఞంలా చేపట్టింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాటి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 2 కోట్ల లక్ష్యానికి మించి యోగాభిలాషులు నమోదు చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల సఫలతకు సంకేతమని మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.