AP NEWS: లేపాక్షి ఉద్యోగులకు గుడ్ న్యూస్ – ఇన్సెంటీవ్ లు పునరుద్ధరిస్తూ నిర్ణయం
AP MINISTER SAVITHA
లేపాక్షి ఉద్యోగులకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత గుడ్ న్యూస్ తెలిపారు. గత ప్రభుత్వం నిలిపేసిన ఇన్సెంటీవ్ లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో ఉద్యోగులకు ఇన్సెంటీవ్ లు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. లేపాక్షి షోరూమ్ ల ద్వారా హ్యాండీ క్రాఫ్ట్స్ ఉత్పత్తుల విక్రయాలు పెంచేలా ఉద్యోగులకు ఇన్సెంటీవ్ లు ఇస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కరోనా పేరుతో గత జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇన్సెంటీవ్ లను అయిదేళ్ల నుంచి నిలిపేసింది. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడంతో, లేపాక్షి ఉద్యోగులకు ఇన్సెంటీవ్ లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంతో పాటు దేశంలోని పలు నగరాల్లో 97 లేపాక్షి షోరూమ్ లున్నాయి. ఆయా షోరూమ్ ల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకూ హ్యాండీ క్రాఫ్ట్స్ అమ్మకాల ద్వారా రూ.5.50 కోట్ల మేర లాభాలు ఆర్జించినట్లు మంత్రి సవిత శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. లేపాక్షి ద్వారా హ్యాండీ క్రాఫ్ట్స్ అమ్మకాలు మరింత పెరిగేలా, ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేలా ఇన్సింటీవ్ లు అందజేయాలని నిర్ణయించినట్లు మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగులకు రూ.32.42 లక్షల మేర ఇన్సింటీవ్ లు అందజేస్తున్నామన్నారు. శాశ్వత ఉద్యోగులకు మూల వేతనంలో 2/3 మేర ఇన్సెంటీవ్ మంజూరు చేశామన్నారు. లేపాక్షి షో రూమ్ ల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.15 వేలు చొప్పున, రోజువారీ వేతనం తీసుకునే ఉద్యోగులకు రూ.4 వేల చొప్పున ఇన్సెంటీవ్ లు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. లేపాక్షి ఉద్యోగులు ఉత్సాహంతో పనిచేసి, హ్యాండీ క్రాఫ్ట్స్ అమ్మకాలు మరింత పెంచడానికి ఇన్సెంటీవ్ లు దోహదపడతాయని మంత్రి సవిత వెల్లడించారు.