MLC ELECTION UPDATE: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి – కలెక్టర్ నాగలక్ష్మి
READY TO MLC ELECTION COUNTING
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు .
ఆదివారం ఏసీ కళాశాల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేసిన కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమం అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీన ముగిసిన అనంతరం అన్ని జిల్లాల బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ జరిగే ఏసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూములోకి తరలించి భద్రపరచడం జరిగిందన్నారు. శాసనమండలి ఎన్నికలు పోలింగ్ 69.5 శాతం జరిగినందున దాదాపు 2.41 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందన్నారు. బ్యాలెట్ పేపర్, మొదటి ప్రాధాన్యత ఓట్లు విధానంతో లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం కౌంటింగ్ సుమారు రెండు నుంచి మూడు రోజులు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రాథమికంగా కౌంటింగ్ మొదటి రౌండ్లో పోలింగ్ బూత్ ల వారీగా పోలైన ఓట్లను సరిచూసుకొని మిక్సింగ్ చేస్తారన్నారు. తదుపరి చెల్లుబాటయ్యే ఓట్లను వెరిఫై చేసి మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరుగుతుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి నిర్దేశించిన కోటా ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలుపొందినట్టు ప్రకటించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎవరికి నిర్దేశిత కోట ఓట్లు రాకపోతే ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన తదుపరి ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓట్లు లెక్కింపు కోసం మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా 750 మంది సిబ్బందిని వివిధ డ్యూటీలు కేటాయించడం జరిగిందన్నారు. అభ్యర్థులు సైతం ఏజెంట్లను మూడు షిఫ్టుల్లో నియమించుకునేలా అవకాశం కల్పించామన్నారు. కౌంటింగ్ ప్రదేశం మొత్తం మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.