AP NEWS: భారతదేశ వారసత్వ, సాంస్కృతిక సంపద యోగా – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
భారతీయుల వారసత్వ, సాంస్కృతిక సంపదైన యోగాను నేడు యావత్ ప్రపంచం అనుసరిస్తోందని, తద్వారా సమగ్రమైన, ప్రశాంతమైన, సంతృప్తికరమైన జీవనశైలి వైపు పయనించే అవకాశం ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు-2025 కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 520 మంది పోటీల్లో పాల్గొనగా విజేతలుగా ఎంపికైన 193 మందికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగాన్ని, విజేతలను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని సూచించారు. భారతదేశ వారసత్వ, సాంస్కృతిక సంపద యోగా అని తెలుపుతూ ఇటీవల తాను బెర్లిన్ కు పర్యాటక పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి ఇన్వెస్టర్లను ఆకర్షించే క్రమంలో ఏపీకి ఉన్న ప్రత్యేకతను వారు గుర్తించి సంబంధిత అంశంపై తనతో చర్చించారని తెలిపారు. 974 కి.మీల సుదీర్ఘ సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో యోగా, వెల్ నెస్ సెంటర్లు వృద్ధి చేయాలని యూరోపియన్లు తనకు సూచించినట్లు మంత్రి వివరించారు. యోగాకు ప్రపంచస్థాయిలో ప్రత్యేక స్థానముందన్నారు. భవిష్యత్తు బాగుండాలంటే యోగాను జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని సూచించారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించి అన్ని రంగాల్లో ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. ప్రస్తుత ఆధునిక జీవనశైలి నుండి రక్షణ పొందేందుకు, ఆరోగ్యమయ జీవితానికి యోగా మంచి సాధనమన్నారు. తాము చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రజలు యోగా సాధనను జీవితాంతం ఆచరించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర-2025 ను రాష్ట్రప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డా. ఎ.సిరి, ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ, ఇతర జిల్లాల అధికారులు పాల్గొన్నారు.