అమెరికాలో నాట్య రత్నం కేవీ సత్యనారాయణకు ఘన సన్మానం||ATA Honors Natya Ratna KV Satyanarayana in Dallas
అమెరికాలో నాట్య రత్నం కేవీ సత్యనారాయణకు ఘన సన్మానం
ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ నాట్యకళాకారుడు, ‘కళా రత్న’ కేవీ సత్యనారాయణకు అమెరికా తెలుగు సంఘం (ATA) ఘనంగా సత్కారించింది. డల్లాస్ నగరంలో జూలై 21వ తేదీ సాయంత్రం నిర్వహించిన ఓ సాంస్కృతిక సభలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ATA ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి, ట్రస్టీ రఘువీర్ మరిపెద్ది, కార్యవర్గ సభ్యులు అతిథిగా పాల్గొని ఈ గౌరవాన్ని అందించారు.
ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ, “కేవీ సత్యనారాయణ గారి సేవలు తెలుగు నాట్య కళకు గొప్ప సంపద. ఆయన శిక్షణలో వేలాది మంది విద్యార్థులు నాట్య కళను అభ్యసించారు. ఆటాతో ఆయనకు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది” అన్నారు. 2025 డిసెంబర్లో రెండూ తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఆటా సహాయ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
కార్యక్రమాన్ని శారద సింగిరెడ్డి సమర్థంగా నిర్వహించగా, ATA సభ్యులు గోలి బుచ్చిరెడ్డి, శ్రీకాంత్ జొన్నల, రామ్ అన్నాడి, శ్రీనివాస్ రెడ్డి కేలం, మాధవి మెంటా, సుమన బీరం, నీరజ పడిగెల, సుమ ముప్పాల, హరిత కేలం తదితరులు పాల్గొన్నారు. వురిమిండి నరసింహారెడ్డి, చిన సత్యం వీరనపు వంటి సంఘ ప్రముఖులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
కేవీ సత్యనారాయణ తన ప్రసంగంలో మాట్లాడుతూ, “ఈ గౌరవం నాకు ఎంతో అంకితభావాన్ని, బాధ్యతను కలిగించింది. నా గురువులు, కుటుంబ సభ్యులు, శిష్యుల సహకారం వల్లనే ఈ స్థాయికి వచ్చాను. ఆటా బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు,” అన్నారు. అలాగే, తన సినీ జీవితంలోని జ్ఞాపకాలను, కళా పయనాన్ని మరియు నాట్యంలో అనుభవాలను ఆయన పంచుకున్నారు.
కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా చిన్నారులు ప్రదర్శించిన సంగీత నాట్యాలు నిలిచాయి. ‘నెల నెలా వెన్నెల’ సాహిత్య సభ వార్షికోత్సవంలో కేవీ సత్యనారాయణ ప్రదర్శించిన కాలర్చనకు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. అదే సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆయనకు ఘనంగా అభినందనలు తెలిపారు.
ఈ వేడుక ATA ఉత్సవాలకు అంకురార్పణగా నిలిచింది. సతీష్ రెడ్డి 2025లో జరగబోయే ఆటా వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారిని ఆహ్వానించారు. నాట్య కళకు సేవచేసే వ్యక్తులకు ఇటువంటి గౌరవాలు కొనసాగాలని ఉద్దేశంతో కార్యక్రమాన్ని ముగించారు.