
సిడ్నీ (ఆస్ట్రేలియా), అక్టోబర్ 19:-ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు.ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కేతో సిడ్నీలో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను ఆస్ట్రేలియా-ఇండియా స్టేట్ ఎంగేజ్మెంట్ ఎజెండాలో చేర్చాలని కోరారు. రాష్ట్రం పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానమని, ఏపీలో ఉన్న అవకాశాలను ఆస్ట్రేలియన్ పారిశ్రామిక వేత్తలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఏపీఈడీబీ, సీఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా–ఏపీ సీఈవో రౌండ్ టేబుల్ సమావేశంకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎనర్జీ, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లోని ప్రాజెక్టులపై ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించేందుకు సహకరించాలని సూచించారు.తదుపరి సీఈవో ఫోరం సెషన్లో ఆంధ్రప్రదేశ్కు భాగస్వామ్యం కల్పించాలన్నారు. ఆ సెషన్లో రాష్ట్ర ప్రాధాన్యత రంగాలు, పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఫోరం వాణిజ్య, పెట్టుబడుల ఎజెండాలో “ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ – గేట్వే టు ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా” అనే అంశంపై ఉమ్మడి నివేదికలు రూపొందించాలని సూచించారు.కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీల భాగస్వామ్యానికి సహకారం అందించాలని కోరారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్టనర్షిప్ సమ్మిట్–2025లో ఫోరం నాయకత్వ బృందం హాజరుకావాలని లోకేష్ ఆహ్వానించారు.ఈ సందర్భంగా మెక్ కే మాట్లాడుతూ, ఆస్ట్రేలియా–భారత్ ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో ఫోరం కీలకపాత్ర పోషిస్తున్నదని అన్నారు. 2012లో ఇరుదేశాల ప్రధానమంత్రుల ఆధ్వర్యంలో ఫోరంను ప్రారంభించామని, ఇరుదేశాల అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు ఇందులో భాగమని తెలిపారు.ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, వలస రంగాల్లో సహకారాన్ని పెంచేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య $48.4 బిలియన్ల వాణిజ్య భాగస్వామ్యం కొనసాగుతున్నదని, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి సీఐఐతో కలిసి పనిచేస్తున్నామని మెక్ కే తెలిపారు.







