
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: చైర్మన్ భరోసా – నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తామని హామీ
గుంటూరు, మార్చి 4: గుంటూరు పట్టణంలోని జీడీసీసీ (GDCC) బ్యాంకు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, ఏఓ కౌంటర్ నందు మెసెంజర్/అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి అక్కినపల్లి కోటేశ్వరమ్మ (కోటమ్మ) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల బ్యాంకు యాజమాన్యం మరియు సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

పార్థివ దేహానికి నివాళి – కుటుంబానికి భరోసా
కోటేశ్వరమ్మ మరణవార్త తెలిసిన వెంటనే జీడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు ఆమె నివాసానికి చేరుకుని, పార్థివ దేహంపై పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటమ్మ క్రమశిక్షణ కలిగిన ఉద్యోగిని అని, ఆమె మరణం బ్యాంకుకు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
నిబంధనల ప్రకారం ఉద్యోగం
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చైర్మన్ హామీ ఇచ్చారు. బ్యాంకు నియమ నిబంధనల ప్రకారం కోటేశ్వరమ్మ కుటుంబంలో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈవో శ్రీ వి.వి.ఎస్. ఫణి కుమార్, ఇతర ఉన్నతాధికారులు మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొని మృతురాలికి నివాళులర్పించారు.Guntur Local News







