An Amazing Progress of 23.75 Crores in Bapatla Development: Rapid Progress in Government Hospital Development Works||23.75 కోట్ల అద్భుత ప్రగతి: ప్రభుత్వ వైద్యశాలల్లో శరవేగంగా అభివృద్ధి పనులు
ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలల్లో అభివృద్ధి పనులు శరవేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. వైద్య విధాన పరిషత్ ఆధీనంలోని ప్రాంతీయ వైద్యశాలలో అభివృద్ధి పనులపై బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ చెప్పారు. మెరుగైన వసతులు, సదుపాయాలకొరకు రూ.23.75 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. స్కానింగ్ సెంటర్లు, క్రిటికల్ కేర్ యూనిట్లు ఏర్పాటు పనులలో ప్రతివారం పురోగతి కనిపించాలన్నారు. 16వ ఆర్థిక సంఘం నిధులు జిల్లాకు రావడంతో ప్రధానంగా చీరాల, బాపట్ల ప్రాంతీయ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఏపీఎంఐడిసి ఇంజినీరింగ్ అధికారులు ప్రతివారం కలెక్టరేట్ కు నివేదిక పంపాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ ను 2026 మే నెల నాటికి పూర్తి చేయాలన్నారు.
ఆర్టిజం సెంటర్, భవిత సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ప్రత్యేక అవసరత ఉన్న చిన్నారుల భవిష్యత్తు కొరకు ఆర్టిజం కేంద్రాలు ఏంతగానో ఉపకరిస్తాయన్నారు. చీరాల ఈపురుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడానికి అధికారిక అనుమతులు వచ్చాయన్నారు. బాపట్ల పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో రూ. 27.5 లక్షలతో ఆర్టిజం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇదే ప్రాంతంలో భవిత కేంద్ర ఏర్పాటుకు అనుకూలమైన భవనం, పరిస్థితులు ఉన్నాయని వివరించారు. అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో వైద్య విధాన్ పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డా. పద్మావతి, ఏపీ ఎమ్ ఐ డి సి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.