
బాపట్ల జిల్లా: అమృతలూరు: అక్టోబర్ 14:-బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండల గ్రామాల్లో వీధికుక్కల ఉద్ధృతితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మండలకేంద్రం అమృతలూరులో వీధికుక్కలు గుంపులుగా తిరుగుతూ స్థానికులు, పాదచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడులు చేసే ప్రమాదం నెలకొంది.ప్రతిరోజూ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పని మీద వెళ్తున్న మహిళలు, వృద్ధులు వీధిలో తిరిగే కుక్కల బెడదతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు కుక్కల దాడులకు లోనై గాయపడ్డ సంఘటనలు నమోదయ్యాయి.
వీధికుక్కల నియంత్రణ కోసం పంచాయతీ అధికారులు, పశువైద్యశాఖ, ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ప్రతి ఏడాది వీధికుక్కల సంఖ్య పెరుగుతోంది. కానీ వాటిని నియంత్రించే చర్యలు కనిపించటం లేదు,” అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, వీధికుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ప్రాణభద్రతకు ఇది అత్యంత కీలకమైన అంశంగా పేర్కొంటున్నారు.







