
బాపట్ల: డిసెంబర్ 19:-సైబర్ నేరాలను సమర్థవంతంగా ఛేదించినందుకు బాపట్ల జిల్లా పోలీసులకు రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఎబిసిడి (Award for Best Crime Detection) అవార్డు లభించింది. పర్యాటక శాఖకు చెందిన వెబ్సైట్లను పోలిన నకిలీ వెబ్సైట్ల ద్వారా పర్యాటకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను పట్టుకున్న కేసులో ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డును ప్రకటించారు.

జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారిని ప్రత్యేకంగా అభినందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు, శుక్రవారం ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారికి మరియు సంబంధిత పోలీస్ బృందానికి అవార్డును అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 2024–2029 కాలానికి నూతన టూరిజం పాలసీ అమలు చేస్తూ రూ.469 కోట్లతో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టిన నేపథ్యంలో, ఆ పాలసీని దెబ్బతీసేలా సైబర్ నేరగాళ్లు నకిలీ టూరిజం వెబ్సైట్ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్న ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ కేసును ఒక సవాలుగా స్వీకరించిన బాపట్ల జిల్లా పోలీసులు, రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేయడంలో విజయవంతమయ్యారు.Bapatla Local News
బాపట్ల సూర్యలంక హరిత రిసార్ట్స్ మేనేజర్ జి. అశోక్ ఫిర్యాదు మేరకు, “Harith Beach Resort Suryalanka” పేరిట నకిలీ వెబ్సైట్ రూపొందించి పర్యాటకులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు జూన్ 16, 2024న బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైం నంబర్ 110/2024 కింద IPC 420 మరియు ఐటీ యాక్ట్ 66-D సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో తిరుమల, శ్రీశైలం, త్రయంబకేశ్వర్ దేవస్థానాలతో పాటు APTDC హరిత రిసార్ట్స్ పేర్లతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి దేశవ్యాప్తంగా ప్రజలను మోసం చేసినట్లు తేలింది. మొత్తం 18 రాష్ట్రాల్లో 127 ఫిర్యాదుల ద్వారా సుమారు రూ.46 నుంచి రూ.50 లక్షల వరకు మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రాజస్థాన్ రాష్ట్రం దిగ్ జిల్లాకు చెందిన **పరంజీత్ (20), బిట్టూ (21)**లను జూలై 23, 2025న అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సైబర్ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ బృందాన్ని డిజిపి గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఎబిసిడి అవార్డు అందుకున్న అధికారులు:
డిఎస్పీ జి. రామాంజనేయులు, ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ టి. శ్రీకాంత్, సిఐ షేక్ నాయబ్ రసూల్, హెడ్ కానిస్టేబుళ్లు పి. సుబ్బరాజు, వి. రమేష్, కానిస్టేబుళ్లు డి. సురేష్, కె. నాగరాజు, కె. బుజ్జి రాజు, మహిళా కానిస్టేబుళ్లు డి. తబిత, ఐ. కీర్తి ఈ అవార్డును స్వీకరించారు.







