
బాపట్ల, అక్టోబర్ 31:-మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం, అవసరమైన సరుకుల పంపిణీని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఐ.ఏ.ఎస్. ఆదేశించారు.శుక్రవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుఫాన్ సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సమావేశంలో జేసీ, డీఆర్ఓ, డీఎస్ఓ, సివిల్ సప్లైస్ డీఎం, వ్యవసాయ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఎపీఎంలు తదితర అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, కిలో పామాయిల్, కిలో కందిపప్పు అందజేయాలని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న 20 వేల మందికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని ఆదేశించారు.అలాగే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలు భోజనం చేసిన తరువాత రాత్రి సమయంలో పునరావాస కేంద్రంలో ఉన్నవారికే ఈ ఆర్థిక సహాయం అందజేయాలని స్పష్టం చేశారు.

మత్స్యకారులు – చేనేత కార్మికులకు ప్రత్యేక సహాయం
జిల్లాలోని 12,671 మంది మత్స్యకారుల కుటుంబాలకు, 8,567 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం, కిలో చక్కెర, కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తుఫాన్ కారణంగా ఐదు రోజులు చేపల వేట నిలిపివేయాల్సి రావడంతో మత్స్యకారులకు, అలాగే మగ్గం పనులు ఆగిపోవడంతో చేనేత కార్మికులకు ప్రభుత్వం ఈ సహాయం అందిస్తోందన్నారు.ఆర్థిక సహాయ విధానం స్పష్టతపునరావాస కేంద్రంలో ఉన్న కుటుంబంలో ఎంత మంది ఉన్నారనే దానిపై ఆర్థిక సహాయం నిర్ణయించబడుతుందని కలెక్టర్ వివరించారు.
ఒకరు ఉన్న కుటుంబానికి ₹1000, ఇద్దరు ఉన్నవారికి ₹2000, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువమంది ఉన్న కుటుంబానికి గరిష్టంగా ₹3000 మాత్రమే అందజేయాలని తెలిపారు.ఆర్థిక సహాయం అందించేటప్పుడు ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. బ్యాంక్ ఖాతా లేని వారికి నగదు రూపంలో చెల్లింపులు చేయవచ్చని చెప్పారు.సమీక్షలో డీఆర్ఓ గంగాధర్ గౌడ్, కలెక్టరేట్ ఏఓ మల్లిఖార్జునరావు, సిపిఓ ఏ.ఎస్. రాజు, మత్స్య శాఖ ఏడీ శ్రీనివాస్ నాయక్, జీఎస్డబ్ల్యూఎస్ జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, వ్యవసాయ, సివిల్ సప్లైస్, ఉద్యాన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.







