
బాపట్ల, మార్చి 24: పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పనుల తీరును బాపట్ల మున్సిపల్ కమిషనర్ శ్రీ జి. రఘునాధ రెడ్డి స్వయంగా పరిశీలించారు. మంగళవారం తెల్లవారుజాము నుండే ఆయన పలు వార్డుల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను తనిఖీ చేస్తూ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. మొదటగా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ రోడ్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆయన, చెత్త సేకరణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని కార్మికులకు సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని పేర్కొంటూ, విధుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

అనంతరం, రాబోయే ఈస్టర్ పండుగను దృష్టిలో ఉంచుకుని చెంగల్రాయుడు తోట మరియు బృందావనం శ్మశాన వాటికలను కమిషనర్ సందర్శించారు. పండుగ నాటికి శ్మశాన వాటికల పరిసరాల్లో పొదలు, మురుగును తొలగించి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జమ్ములపాలెం మెయిన్ రోడ్, రాజీవ్ గాంధీ కాలనీల్లో జరుగుతున్న డ్రైనేజీల డీ-సిల్టేషన్ పనులను పరిశీలించి, నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా పూడిక తీయాలని స్పష్టం చేశారు.

వర్షాకాలం ముందే అన్ని ప్రధాన డ్రైన్లను శుభ్రం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పర్యటనలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సయ్యద్ నజీర్, చేవూరి కరుణా మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారుhttp://BAPATLA NEWS







