BAPATLA NEWS: భూమి దస్త్రాలతోనే రెవెన్యూశాఖకు ప్రత్యేక గుర్తింపు
విజ్ఞానం పెంచుకుంటేనే రెవిన్యూశాఖ ద్వారా ప్రజలకు విశేష సేవలు అందించగలమని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ శాఖలన్నింటికీ మాతృ శాఖగా రెవెన్యూ శాఖ నిలుస్తోందన్నారు. ప్రత్యేక గుర్తింపు ఉన్న రెవెన్యూ శాఖ పుట్టినరోజును ప్రభుత్వం అధికారికంగా జరుపుకోవడానికి అనుమతులు ఇవ్వడం సంతోషదాయకమన్నారు. 240 సంవత్సరాల క్రితం రెవిన్యూ బోర్డు ఏర్పాటు కాగా, ఆ రోజునే రెవిన్యూ డే గా పాటిస్తున్నట్లు చెప్పారు. ఆర్ ఎస్ ఆర్ మొదలైన నాటినుండి రెవెన్యూకు ప్రత్యేక హోదా ఉందన్నారు. రెవిన్యూలో భూమి దస్త్రాల విలువ రూ.కోట్లతో సమానమన్నారు. ఇందులో పనిచేస్తే ఎంతో విలువ, హోదా లభిస్తుందన్నారు. విపత్తు సమయాలలో రెవెన్యూ శాఖ ఉద్యోగుల సేవలు వెల కట్టలేనివన్నారు. అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేసేది రెవెన్యూ శాఖ ఒకటేనన్నారు. రెవిన్యూశాఖలో అన్ని హోదాలలో శిక్షణ పొందిన తరువాతనే ఐఏఎస్ లుగా నియమితులవుతారన్నారు. రెవిన్యూ శాఖలోకి వచ్చిన ప్రతి ఉద్యోగి చట్టాలు, జీవోలపై అవగాహన పొందితేనే ప్రాధాన్యత మరింత పెరుగుతుందన్నారు. ప్రజలకు విశేష సేవలందించే భాగ్యం రెవిన్యూశాఖ ద్వారానే ఏర్పడుతుందన్నారు. నూతనంగా రెవిన్యూలోకి వచ్చే ఉద్యోగులకు చట్టాలపై కనీసం అవగాహన ఉండటం లేదన్నారు. విధుల నిర్వహణలో మరింత ప్రావీణ్యం పొందాలన్నారు. ఈనెలఖరకు ఉద్యోగ విరమణ ముగ్గురు తహసిల్దార్లు సీతారత్నం, త్రిపుర బాల సుందరమ్మ, వెంకటరత్నంలను ప్రత్యేకంగా అభినందించారు.