

జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులకు భూ సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు పలు సూచనలు చేశారు.
సోమవారం, జాతీయ రహదారుల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్థానిక కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపట్ల జిల్లా లో వెళ్లే జాతీయ రహదారులు 544జి,167ఎ,16,544డి ప్రాజెక్టు పనులను పూర్తి చేయుటకు కావలసిన భూసేకరణలో ఉండే సమస్యలను త్వరితగతిన పరిష్కరించి జాతీయ రహదారుల పురోగతిని మెరుగుపరిచే విధంగా అధికారులు పనిచేయాలని ఆయన అన్నారు. ప్రతి వారం రహదాలకు సంబంధించి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. బాపట్ల జిల్లాకు ప్రాధాన్యత ఇస్తూ పనులను త్వరగా పూర్తి చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని ఆయన జాతీయ రహదారుల అధికారులకు తెలిపారు.
బాపట్లలో రైల్వే ట్రాక్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు కావలసిన భూసేకరణ విషయమై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆరా తీశారు. భూ సేకరణకు సంబంధించి రెవిన్యూ అధికారులు, రైల్వే అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేసి నివేదిక అందజేయాలని ఆయన అధికారులకు సూచించారు. బాపట్లలో రైల్వే స్టేషన్ పరిసరాల అభివృద్ధికి సంబంధించి స్థల సేకరణ విషయంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన రైల్వే అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, ల్యాండ్ ఎక్విజిషన్ సెక్షన్ సూపర్డెంట్ శ్రీలక్ష్మి, వీక్షణ సమావేశం ద్వారా బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారులు గ్లోరియా, చంద్రశేఖర్, అద్దంకి, జే పంగులూరు, చీరాల, పర్చూరు, కారంచేడు తాహాసిల్దార్లు, జాతీయ రహదారులు మరియు రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.







