Guntur News: కేంద్ర బడ్జెట్లో డబల్ ఇంజన్ సర్కార్ వైఫల్యం – జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
CRITICIZE ON CENTRAL GOVT
2025 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు రిక్త హస్తాలు చూపాయని డబల్ ఇంజన్ సర్కార్ వైఫల్యం చెందిందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో రావలసిన ప్రయోజనా లేవి ప్రకటించలేదని ,నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యతను ఇవ్వలేదని, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రం పూర్తిగా నిధులను అందిస్తానని పేర్కొన్న పోలవరం ఎత్తును 45.72నుండి 45. 15 కు తగ్గించి బహుళార్థ ప్రాజెక్టును బ్యారేజ్ గా మార్చినారన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురజాడను గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరిచి పోయిందన్నారు. బీహార్, ఢిల్లీ ఎన్నికల ప్రచార అస్త్రంగా కేంద్ర బడ్జెట్ ను రూపొందించారన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రభుత్వ రంగంలో ఒక్క భారీ ప్రాజెక్టును ప్రకటించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు కేంద్రమంత్రులు 25 పార్లమెంట్ సభ్యులు ,45 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాకపోవడం విచారకరమన్నారు. రాజకీయ అవినీతితో కేంద్రంతో పోరాడే శక్తిని కోల్పోతున్నామన్నారు. కార్పొరేట్ శక్తులు బలోపేతం కావటానికి, ఆర్థిక అసమానతలు మరింత పెరగడానికి కేంద్ర బడ్జెట్ తోడ్పడుతుందని ,కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాలను తీర్చుకోవడానికి కేంద్ర బడ్జెట్ ను వినియోగిస్తుందని విమర్శించారు. పరోక్ష పన్నులను పెంచుతూ, ప్రత్యక్ష పన్నులను తగ్గిస్తూ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడానికి దోహదపడుతుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి ఎలాంటి గ్రాంట్ ప్రకటించలేదని, ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన ప్రాంతాలకీ నిధులు కేటాయించ లేదన్నారు. వేతన జీవులకు 12 లక్షల వరకు ఆదాయ పన్ను పూర్తిగా మినహాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.