
పర్చూరు, జనవరి 31 :-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో అంబటి వ్యాఖ్యలు రాజకీయ విలువలకు విరుద్ధమని విమర్శించారు.
రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు దిగజారుడుతనానికి నిదర్శనమని ఏలూరి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచమైనవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
గతంలో నోరు పారేసుకున్న ధోరణి కారణంగానే వైసీపీకి ప్రజలు ఘోర పరాజయం చూపించి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. అయినా అంబటి రాంబాబుకు ఇప్పటికీ సిగ్గు, పశ్చాత్తాపం లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు.
వైసీపీ మళ్లీ బూతుల సంస్కృతిని రాజకీయాల్లోకి తీసుకువస్తోందని ఆరోపించిన ఆయన, గొడవలు, హింసాత్మక ధోరణులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.Bapatla Local News
అంబటి రాంబాబు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అంబటిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని కోరారు. ఇకనైనా నోరును అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు.










