GUNTUR NEWS: దాతృత్వంతో డ్రోన్ కెమెరా బహుకరించిన దాత – సన్మానించి, ధన్యవాదాలు తెలిపిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
GUNTUR S.P SERVEES PROGRAMME
గుంటూరు జిల్లా పోలీస్ విభాగానికి దాత ఉప్పుటూరి చిన్న రాములు డ్రోన్ కెమెరాను బహుకరించారు. ఈమేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీని వినియోగించి, నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్స్, ఈవ్ టీజింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ఏరియాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, ఇతర నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్నాయని తెలిపారు. శివారు, నిశిత ప్రాంతాలను, తోటలు, బహిరంగ ప్రదేశాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి నిఘా ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.అదేవిధంగా వీవీఐపీలు, వీఐపీల బందోబస్తులలో కుడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాల సహాయంతో పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు. ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ నియంత్రణ, సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టేందుకు
డ్రోన్స్ వినియోగిస్తుండడం జరుగుతుందని తెలిపారు. శాంతిభద్రతలు, నేరాలు & ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ, ఇతర పోలీసింగ్ అవసరాల నిమిత్తం వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లడిగుంట గ్రామానికి చెందిన ఉప్పుటూరి. చిన్న రాములు, వారి కుమారుడు ఉప్పుటూరి రామ్ చౌదరి (USA) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉప్పుటూరి చిన్న రాములు సేవా ట్రస్ట్ తరఫున అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఒక DJI Air3s డ్రోన్ కెమెరాను గుంటూరు జిల్లా పోలీస్ విభాగానికి అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు. సామాజిక బాధ్యత, సేవా దృక్పథంతో గుంటూరు పోలీస్ విభాగానికి ఒక డ్రోన్ కెమెరాను బహుకరించడం అభినందనీయం, దాత పుల్లడిగుంట గ్రామానికి చెందిన ఉప్పుటూరి. చిన్న రాములు, వారి కుమారుడు ఉప్పుటూరి రామ్ చౌదరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ప్రజాహితం కొరకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. (డ్రోన్ కెమేరాను వట్టిచెరుకూరు పోలీస్ వారికి అప్పగించడం జరిగినది.) ఉప్పుటూరి చిన్న రాములుని స్ఫూర్తిగా భావించి ప్రజా రక్షణ కొరకు పోలీసు వారు చేస్తున్న కృషికి, సేవలకు తమ వంతు సహకారం అందించడానికి మరి కొంతమంది దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను బహుకరించాలని కోరుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వట్టిచెరుకూరు సీఐ రామానాయక్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.